ఒక రాజ్యాన్ని పాలించే మహారాజు ఒక రోజు ఒక మహర్షి దగ్గరికి వెళ్ళాడు. మహర్షి ఎదురుగా భక్తితో చేతులు జోడించి ఇలా వేడుకున్నాడు. " అయ్యా నేను ఒక రాజును.నా దగ్గర సంపద వుంది, సైన్యం వుంది, నన్ను ప్రేమించే బంధుమిత్రులు వున్నారు, నేను శాస్త్రాలు చదివాను, పక్క రాజ్యాల రాజులు నేనంటే భయపడతారు. అయినా నా మనసులో ఎల్లప్పుడు తెలియని ఆందోళన,భయం ఉంటాయి. ప్రతి నిమిషం అధైర్యం నన్ను వెంటాడుతూ ఉంటుంది. దయచేసి నాకు మనశ్శాంతి రావడంలో సాయం చేయండి" అన్నాడు.
అప్పుడు మహర్షి ఇలా చెప్పాడు. "మనిషి కష్టాల్ని చూసి చలించిన అమ్మవారు మనిషికి సాయం చేసేందుకు అష్ట లక్ష్మి అంశలను అవతరింప చేసింది. వారే ధనలక్ష్మి, ధాన్య లక్ష్మి, విద్యా లక్ష్మి, విజయలక్ష్మి, సంతాన లక్ష్మి, గజ లక్ష్మి,, ధైర్య లక్ష్మి, ఆది లక్ష్మి. భువి పైకి వచ్చిన లక్ష్మిదేవిలందరు తాము చేయదలచిన పనులను గురించి ప్రస్తావించారు. ధనలక్ష్మి నేను ప్రపంచంలో వుండే ధనాన్ని నియంత్రయిస్తాను అంది, అప్పుడు ధాన్య లక్ష్మి ప్రపంచంలో వున్న ఆహారానికి నియంత్రణ నేను చేపడతాను అంది. విద్యాలక్మి ప్రపంచలోని విద్యను, విజయలక్ష్మి విజయాన్ని, గజ లక్ష్మి పదవిని, సంతాన లక్ష్మి సంతానాన్ని ,పరివారాన్ని అందిస్తామని చెప్పారు. ఆది లక్ష్మి నాకు ప్రపంచమంతా తిరగవలిసిన అవసరం లేదు. మనిషి మనసుకి ఆత్మకు మధ్య వారధి గా నేను నిలుస్తాను. నేను కటాక్షిస్తే మనిషికి కోరికలన్నీ నశిస్తాయి మోక్షం లభిస్తుంది కనుక నేను కటాక్షించిన వారికి మిగిలిన లక్ష్మి అంశల అవసరం ఉండదు అంది . ఇదంతా వింటున్న ధైర్యలక్ష్మి కోపంతో మీరంతా ప్రపంచమంతా తిరుగుతోంటే నేను,ఆది లక్ష్మి మాత్రం ఈ శరీరం లోపలే ఉండి పోవాలా? ఇదెక్కడి న్యాయం? నేను మేలుకొని నా పని చెయ్యాలంటే మీలో ఎవరో ఒకరు నాకు తోడుగా ఉండాలి లేకపోతే నేను నిద్రావస్థలోకి వెళ్ళిపోతాను అంది. మిగిలిన వారు అదెలా సాధ్యం మేము ఆరుగురం ప్రపంచం అంతా తిరిగి మా పనులు చేయాలిగా అన్నారు.
అప్పుడు ధైర్య లక్ష్మి "సరే ఎలా అయితే మీరు నాతో ఉండి నాకు ఉపయోగ పడలేదో , ఏ మనిషి అయితే నన్ను దగ్గర ఉంచుకుని నన్ను గుర్తించకుండా మీ చుట్టూ తిరుగుతాడో వారితో నేనూ ఉండి ఉండనట్లు వ్యవహరిస్తాను. ఏ మనిషి నన్ను , ఆది లక్ష్మిని గుర్తించి కొలుస్తాడో , ఎవరైతే నన్ను మేలుకొలపుతాడో వాళ్ళకు నేను ఉపయోగ పడతాను లేకపోతే నిద్రావస్థలోకి జారుకొంటాను" అని చెప్పింది.
"ఓ మహారాజా, నువ్వు పొరుగు రాజ్యాన్ని జయించినప్పుడు, నీకు సంతానం కలిగినప్పుడు, ప్రజలు నీకు జైజైలు పలికినప్పుడు నీకు లభించిన ఆనందం, ధైర్యం ఎక్కువ సమయం నిలబడదు. నీ దగ్గర ప్రపంచాన్ని నడిపించే ఆరుగురు లక్ష్మి దేవిలు వున్నారు కానీ ధైర్య లక్ష్మి, ఆది లక్ష్మి అవసరాన్ని నీవు గుర్తించలేదు."
" ఓ రాజా నీవు లక్ష్మి తత్వాన్ని గుర్తించలేకపోయావు. ధన, ధన్య, సంతాన, గజ, విద్య, విజయ లక్ష్మిలు కలిపితే ప్రాపంచిక లక్ష్మి అనగా బయట మనం చూసే ప్రపంచాన్ని నడిపే లక్ష్మి. ఈ ప్రాపంచిక లక్ష్మి ఒక చోట ఉండదు సమయాన్ని బట్టి, వ్యక్తి కర్మలను, అదృష్టాన్ని బట్టి, చోటుని బట్టి మారుతూ ఉంటుంది. ఆ లక్ష్మి చాలా వరకు విధి అధీనంలో ఉంటుంది. అటువంటి లక్ష్మి ద్వారా ధైర్య లక్ష్మిని కటాక్షించు కోవాలని చూస్తే ఆ ధైర్యం కూడా ఆశాశ్వతమైనదిగా ఉంటుంది.
ఇక ఎల్లప్పుడూ మనలో వుండే లక్ష్మి స్వరూపాలు ధైర్య లక్ష్మి, ఆదిలక్ష్మి. వీరు అంతర్లక్ష్మి స్వరూపాలు.వీరిని సంపూర్ణ జాగృతావస్థలో ఉంచగలమా లేదా అన్నది మన కర్మ, ఆలోచన, వివేకాన్ని బట్టి ఉంటుంది.
ప్రాపంచిక లక్ష్మి మనిషిని చేరిన కొంత సమయం వరకు మాత్రమే ధైర్యాన్ని కలిగిస్తుంది. క్రమక్రమంగా మనిషి మనసులో మరింత కోరికను జనింప చేయటం, తరువాత ధైర్యం స్థానంలో లక్ష్మి దూరమవుతుందేమోనన్న భయాన్ని కల్పించటం ప్రాపంచిక లక్ష్మి లక్షణం . సంపద,కోరిక, భయం ఇది ఒక చక్రవ్యూహం . ఇదే ప్రాపంచిక లక్ష్మి తత్త్వం.
అంతర్లక్ష్మి అయిన ధైర్య లక్ష్మి, ఆది లక్ష్మి ఎల్లప్పుడూ ధైర్యాన్ని, శాంతిని కలుగచేస్తాయి. ఆది లక్ష్మి ద్వారా సంక్రమించే వైరాగ్యం, వివేకం ఎప్పుడూ ధైర్య లక్ష్మిని జాగృతావస్థలో ఉంచుతాయి. ఒక మనిషి ప్రాపంచిక లక్ష్మిని ఆహ్వానించవచ్చు ఆరాధన మాత్రం అంతర్లక్ష్మి కే జరగాలి . ధైర్య లక్ష్మి ని ఆ స్థాయిలో జాగృతం చేసిన వారికి మిగిలిన లక్ష్మి ల అవసరమే ఉండదు." ఇది విన్న మహారాజు నిజం గ్రహించాడు. తన కుమారులకు కేవలం ప్రపంచం గురించి నేర్పే విద్యే కాకుండా విద్యా లక్ష్మి ద్వారా అంతర్లక్ష్మిని జాగృతి చేయవలసిన అవసరం గ్రహించాడు.
"ఒక మనిషి ప్రాపంచిక లక్ష్మిని ఆహ్వానించవచ్చు ఆరాధన మాత్రం అంతర్లక్ష్మి కే జరగాలి" Excellent illumination.
ReplyDeleteI was able to connect to this story immediately as I have the same question as the king in my own life. My daughter and my wife are my ADI-LAXMI and DHIRYA- LAXMI of my life
ReplyDelete